పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి: గద్దర్ అభిమానుల సంఘం.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జూన్ 8 మన వార్త : దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కేంద్ర ప్రభుత్వం వెంటనే పెంచిన ధరలను తగ్గించాలని గద్దర్ అభిమానుల సంఘం, అణగారిన ప్రజల హక్కుల పోరాట కమిటీ డిమాండ్ చేశాయి.
ఈ మేరకు సంఘం అధ్యక్షుడు సి.యల్. యాదగిరి విడుదల చేసిన ప్రకటనలో మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు కూడా భారీగా పెరిగి ప్రజలపై అదనపు భారం పడుతోందని విమర్శించారు.
రోజువారీ కూలీ పనులు చేసుకుని జీవనం సాగించే పేద, మధ్యతరగతి కుటుంబాలు పెరిగిన ధరల కారణంగా ఆర్థికంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. గతంలో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పటికీ, ఆ ప్రయోజనం ప్రజలకు అందలేదని, ప్రస్తుతం యుద్ధ పరిస్థితులను సాకుగా చూపుతూ ఇంధన ధరలను మరింత పెంచడం ప్రజా వ్యతిరేక చర్య అని ఆరోపించారు.
ధరల నియంత్రణపై చర్యలు తీసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం, ప్రజలకు పొదుపు చేయాలని సూచించడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలు ఎన్నుకున్న రాజకీయ పార్టీలు కూడా ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు.
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదల ప్రభావం నిత్యావసర వస్తువుల ధరలపై పడుతోందని, దీంతో సాధారణ ప్రజల జీవనం మరింత కష్టతరంగా మారిందన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ధరలను తగ్గించకపోతే వివిధ ప్రజా సంఘాలను కలుపుకుని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో అణగారిన ప్రజల హక్కుల పోరాట కమిటీ, గద్దర్ అభిమానుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
Medchal -Malkajgiri District
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి: గద్దర్ అభిమానుల సంఘం.
Quick Summary:
Mana vartha Reporter Anthony